శిఖర్ ధావన్ (జననం 1985 డిసెంబరు 5) భారతీయ క్రికెట్ ఆటగాడు, ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్లోపంజాబ్ కింగ్స్కు కెప్టెన్. ఫస్ట్-క్లాస్ క్రికెట్లోఢిల్లీ తరపున ఆడతాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలలో, ధావన్ భారతదేశం తరపున అత్యధిక పరుగుల రికార్డు సాధించాడు.[4] ఐపీఎల్ చరిత్రలో వెంటవెంటనే రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు.[5] 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అతని విన్యాసాలకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు అందుకున్నాడు. 2018 ఆసియా కప్లో ధావన్, టోర్నమెంటులో టాప్ స్కోరరుగా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు.
ధావన్ 2010 అక్టోబరులో విశాఖపట్నంలోఆస్ట్రేలియాపైవన్డే అంతర్జాతీయ (వన్డే) పోటీల్లోకి ప్రవేశించాడు. అతని తొలి టెస్టు కూడా - 2013 మార్చిలో మొహాలీలో - ఆస్ట్రేలియాపైనే ఆడి, సెంచరీ చేసాడు. 174 బంతుల్లో 187 పరుగులు చేసి, తొలి మ్యాచ్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సాధించాడు.[6][7]
2013 ఆగస్టులో, ప్రిటోరియాలో దక్షిణాఫ్రికా A కి వ్యతిరేకంగా భారతదేశం A తరపున 150 బంతుల్లో 248 పరుగులు చేసి ధావన్ లిస్టు A మ్యాచ్లో అప్పటి-రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.[8] జోహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ వన్డేలో, తన 100వ వన్డే గేమ్లో సెంచరీ చేసి, అది సాధించిన మొదటి భారతీయుడు, మొత్తం మీద తొమ్మిదో ఆటగాడు అయ్యాడు. 2018 జూన్ 14న, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో మొదటి రోజు లంచ్కు ముందే సెంచరీ చేసిన ఆరో బ్యాటరుగా, భారతదేశపు మొదటి బ్యాటరుగా నిలిచాడు.[9]
శిఖర్ ధావన్ 1985 డిసెంబరు 5న ఢిల్లీలోపంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో సునైనా, మహేంద్ర పాల్ ధావన్ దంపతులకు జన్మించాడు. ఢిల్లీ, మీరా బాగ్లోని సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 12 సంవత్సరాల వయస్సు నుండి,[10] అతను కోచ్ తారక్ సిన్హా మార్గదర్శకత్వంలో సోనెట్ క్లబ్లో శిక్షణ పొందాడు.[11] తారక్ సిన్హా 12 మంది అంతర్జాతీయ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు.[12] ధావన్ తొలిసారి క్లబ్లో చేరినప్పుడు వికెట్ కీపర్గా ఉన్నాడు.[10]
ధావన్ 2006-07 రంజీ సీజన్ను తమిళనాడుపై మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ చేసాడు.[13]వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, ఆశిష్ నెహ్రా వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, 2007 ఫిబ్రవరిలో రంజీ వన్డే ట్రోఫీకి ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. ధావన్ ఆ టోర్నమెంట్లో 32.20 సగటుతో 46 అత్యధిక స్కోరుతో 161 పరుగులు చేశాడు. అయితే ఢిల్లీ క్వార్టర్ ఫైనల్స్ను దాటలేకపోయింది.[14] అతను ఫిబ్రవరి-మార్చిలో దేవధర్ ట్రోఫీలో నార్త్ జోన్ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగు చేసి, మూడు ఇన్నింగ్స్లలో 23.66 సగటు సాధించాడు.[15]
ఢిల్లీ, 2007-08 సీజన్లో రంజీ ట్రోఫీ గెలుచుకుంది. దీనిలో ధావన్ 8 మ్యాచ్లలో 43.84 సగటుతో 570 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.[16] ఆ తర్వాత జరిగిన దులీప్ ట్రోఫీలో, అతను నార్త్ జోన్ కోసం మూడు గేమ్లలో 42.25 సగటు సాధించాడు.[17] 2008 ఫిబ్రవరి-మార్చిలో విజయ్ హజారే ట్రోఫీలో (ఇంతకుముందు రంజీ వన్డే ట్రోఫీ అని పిలిచేవారు) 6 మ్యాచ్ల్లో 97.25 సగటుతో రెండు సెంచరీలతో, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 389 పరుగులు చేసి, రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[18] అయితే, మార్చిలో జరిగిన దేవధర్ ట్రోఫీలో ధావన్ ఫామ్ కోల్పోయాడు. నార్త్ జోన్కు ఆడి 0, 1, 5 స్కోర్లు చేసాడు. సెప్టెంబరులో న్యూజిలాండ్ A తో జరిగిన నాలుగు-రోజుల మ్యాచ్లో భారతదేశం A తరపున ఆడుతూ 27, 7 [19] పరుగులు మాత్రమే చేసాడు.[20]
ధావన్ రంజీ ట్రోఫీ 2004-05 సీజన్లో, 2004 నవంబరులో ఆంధ్రాపైఢిల్లీ తరఫున ధావన్ ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేసి, తొలి ఇన్నింగ్స్లో 49 పరుగులు చేశాడు. అతను రంజీ సీజన్లో 6 మ్యాచ్ల నుండి మొత్తం 461 పరుగులతో, 130 పరుగుల అత్యధిక స్కోరుతో ఢిల్లీ జట్టులో ప్రధానమైన బ్యాటరుగా నిలిచాడు. జట్టులోని అజయ్ జడేజా, ఆకాష్ చోప్రా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.[21] ఆ తర్వాత జరిగిన రంజీ వన్డే ట్రోఫీలో ధావన్, 2005 జనవరిలో జమ్మూ కాశ్మీర్పై తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, హర్యానాలపై వరుసగా అజేయ సెంచరీలు చేశాడు.[22][23] ఫిబ్రవరిలో ఛాలెంజర్ ట్రోఫీ కోసం భారత సీనియర్స్ జట్టులో ఎంపికయ్యాడు. దీనిలో అతను భారతదేశం B కి వ్యతిరేకంగా భవిష్యత్ భారత సహచరుడు MS ధోనితో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండో మ్యాచ్లో ధావన్, 124 బంతుల్లో 126 పరుగులు చేశాడు. సెంచరీతో చెలరేగిన ధోనీతో కలిసి 246 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. భారత సీనియర్స్ రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల ఛేదనలో అది సహాయపడింది.[24] ఆ ఏడాది మార్చిలో పర్యాటక పాకిస్థానీ జట్టుతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్లో ఆడేందుకు అతను ఇండియా A జట్టుకు ఎంపికయ్యాడు. నవేద్-ఉల్-హసన్బౌలింగులో ఔటయ్యే ముందు అతను 8 పరుగులు చేశాడు.[25]
2010 అక్టోబరులో, భారత సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో మూడు-మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం "రెండవ స్థాయి" [26] స్క్వాడ్ను ఎంపిక చేశారు. ఇందులో ధావన్ 14 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. ఇది భారత సీనియర్ జట్టులో తొలిసారి ఎంపికైన సందర్భం.[27] భారత కెప్టెన్ ధోనీ, సిరీస్కు ముందు ధావన్కు మద్దతుగా, "మేమిద్దరం ముంబైలో (2005లో) ఛాలెంజర్స్లో స్కోర్ చేసాము. జాతీయ జట్టులో స్థిరపడే అవకాశం వచ్చింది. అతని కెరీర్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి, కానీ అతను చాలా స్థిరంగా ఉన్నాడు. ఓపెనర్గా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్లు ఒకే స్థాయిలో ఉన్నందున ఇది చాలా కఠినమైనది. ఎట్టకేలకు అతడికి అవకాశం రావడం విశేషం. అతను స్కోర్ చేస్తాడనీ, బెంచ్ మరింత పటిష్టం అవుతుందనీ ఆశిస్తున్నాను" అని చెప్పాడు.[28] అక్టోబరు 20న విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో సౌరభ్ తివారీతో కలిసి ధావన్, అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 289/3 పరుగులు చేయగా, పరుగుల వేటలో ధావన్ భారత్ తరఫున ఓపెనింగులో దిగాడు. మొదటి డెలివరీలో పరుగులు తీయలేదు. రెండవ బంతికి క్లింట్ మెక్కే చేతిలో బౌల్డ్ అయ్యాడు.[29]
2011 జూన్లో, భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక T20I కోసం వెస్టిండీస్లో పర్యటించింది. పరిమిత ఓవర్లలో భారత రెగ్యులర్ ఓపెనర్లైన సెహ్వాగ్, గంభీర్లు భుజం గాయాల కారణంగా పర్యటన నుండి తప్పుకున్నారు. టెండూల్కర్ ప్రపంచ కప్ విజయం, IPL తర్వాత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.[30] మునుపటి దేశీయ సీజన్లో ధావన్ ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ, ఐపిఎల్ సమయంలో అతను ఫామ్లోకి తిరిగి వచ్చే సంకేతాలను చూపించినందున సెలెక్టర్లు అతన్ని పరిమిత ఓవర్ల జట్టులోకి తీసుకున్నారు. అతను జూన్ 4న వెస్టిండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో తన తొలి T20I ఆడాడు. పార్థివ్ పటేల్తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించి, 11 బంతుల్లో 5 పరుగులు చేసి, అవుటయ్యాడు.[31] వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో, తన కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న ధావన్, 76 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 215 పరుగుల ఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.[32] అతను సిరీస్లో ఆడిన ఇతర మ్యాచ్లలో 3, 4, 11 స్కోర్లు చేసాడు.
2012-13 దేశీయ సీజన్లో స్థిరమైన ప్రదర్శనల తర్వాత, ధావన్కు 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు-మ్యాచ్ల సిరీస్కు భారత టెస్టు జట్టుకు పిలుపు వచ్చింది. టెస్టు రెగ్యులర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్లతో కూడిన జట్టులో అతను మూడవ ఎంపిక ఓపెనర్. భారతదేశం మొదటి రెండు టెస్టుల్లో ధావన్ను పక్కనపెట్టి, సెహ్వాగ్, విజయ్లను ఎంపిక చేసింది. ఆ తర్వాత సెహ్వాగ్ను పేలవమైన ఫామ్ కారణంగా జట్టు నుండి తొలగించారు.[33] మూడవ టెస్ట్లో అతని స్థానంలో ధావన్ను తీసుకున్నారు. మార్చి 14న మొహాలీలో జరిగిన టెస్టులో ధావన్ రంగప్రవేశం చేసాడు. సచిన్ టెండూల్కర్ నుండి క్యాప్ అందుకున్నాడు. సచిన్ అతనికి, "దేశవాళీ క్రికెట్లో నువ్వు చాలా దమ్మున్న ఆటగాడిగా తెలుసు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా నిన్ను దమ్మున్న ఆటగాడిగా చూడాలనుకుంటున్నాం. చూపించు నీ దమ్ము" అని చెప్పాడు.[34] మ్యాచ్లో మొదటి రోజు వర్షం కారణంగా కొట్టుకుపోగా, రెండో రోజు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో రోజు ఉదయం ఆస్ట్రేలియా 408 పరుగులకు ఆలౌటైంది. ధావన్, విజయ్లతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించి, మూడో రోజు మిగిలిన బ్యాటింగ్ చేయడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 283 పరుగులు చేసింది. ధావన్ 185 పరుగులతో, విజయ్ 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో, ధావన్ తన తొలి టెస్టులోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు, గుండప్ప విశ్వనాథ్ (137 వర్సెస్ ఆస్ట్రేలియా, కాన్పూర్లో, 1969) నెలకొల్పిన దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టాడు. నాలుగో రోజు రెండో ఓవర్లో ధావన్ 187 (174 బంతుల్లో) పరుగుల వద్ద నాథన్ లియాన్ బౌలింగ్లో సిల్లీ పాయింట్ వద్ద ఎడ్ కోవాన్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.[35] నాలుగో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చేతికి గాయం కావడంతో అతను భారత రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.[36] ఈ నాక్ను ESPNCricinfo 2013లో అత్యుత్తమ టెస్టు బ్యాటింగ్ ప్రదర్శనగా పేర్కొంది.[37]
ధావన్ గాయం నుండి కోలుకుని, 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున చెన్నై సూపర్ కింగ్స్తో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్కి తిరిగి వచ్చి, 45 బంతుల్లో 63 పరుగులు చేశాడు.[38] అతను ఆ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి, మూడు అర్ధసెంచరీలతో సహా 38.87 సగటుతో 311 పరుగులు చేశాడు.[39] ఆ ప్రదర్శనతో అతనికి జూన్లో ఇంగ్లాండ్లో జరగనున్న 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత వన్డే జట్టుకు ఆడే అవకాశం వచ్చింది.[40] ఆ టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి ధావన్ బ్యాటింగ్ ప్రారంభించాడు. ఈ జోడీ విజయాన్ని సాధించింది. కార్డిఫ్లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టోర్నమెంటు ప్రారంభ మ్యాచ్లో ధావన్, 94 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో సహా 114 పరుగులతో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. శర్మతో కలిసి 127 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయం సాధించింది. ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.[41] ESPNCricinfo దీన్ని, 2013 సంవత్సరంలో అత్యుత్తమ వన్డే బ్యాటింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నామినేట్ చేసింది.[42]
వెస్టిండీస్తో జరిగిన తదుపరి మ్యాచ్లో, అతను 107 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేశాడు. అది అతని రెండవ వన్డే సెంచరీ. రోహిత్తో కలిసి మొదటి వికెట్కు 101 పరుగులు జోడించాడు. 234 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్ల నష్టానికి 10 ఓవర్లకు పైగా ఛేదించింది.[43] బర్మింగ్హామ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్, భారత్ 8 వికెట్ల తేడాతో (D/L పద్ధతి) గెలిచింది. ఈ మ్యాచ్లో ధావన్ 41 బంతుల్లో 48 పరుగులు చేశాడు.[44] అన్ని మ్యాచ్లు గెలిచి గ్రూప్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో, అతను 92 బంతుల్లో 68 పరుగులు చేశాడు, దీనితో భారత్ 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[45] ఈ విజయంతో భారత్ బర్మింగ్హామ్లో ఫైనల్కు వెళ్ళింది. ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో, వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో ఫైనల్ను 20 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ధావన్ 24 బంతుల్లో 31 పరుగులు చేయడంతో 129/7 చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.[46] 5 మ్యాచ్ల నుండి 90.75 సగటుతో, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 363 పరుగులు చేసిన ధావన్,[47] టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసినందుకు గోల్డెన్ బ్యాట్ అవార్డును గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా కూడా ఎంపికయ్యాడు.[46] అతను ఐసిసి, క్రిక్ఇన్ఫోల 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో కూడా ఎంపికయ్యాడు.[48][49] IPL 2020 మ్యాచ్ 30కి ముందు ధావన్ T20లలో 7,500 మైలురాయికి 5 పరుగులు తక్కువగా ఉన్నాడు. 34 ఏళ్ల ధావన్ తన 267వ T20లో, 264వ ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని సాధించాడు.[50]
వెస్టిండీస్, శ్రీలంకలతో ముక్కోణపు సిరీస్ ఆడేందుకు భారత జట్టు వెస్టిండీస్ వెళ్ళింది. ధావన్ ఐదు గేమ్లలో [51] 27 సగటుతో 135 పరుగులు చేశాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో అతని ఏకైక అర్ధ సెంచరీ, 77 బంతుల్లో 69 పరుగులు చేశాడు.[52] అతను 16 పరుగులు చేసిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ సిరీస్ను గెలుచుకుంది.[53] జూలై-ఆగస్టులో, విరాట్ కోహ్లి సారథ్యంలో పలువురు ఫస్ట్-ఛాయిస్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, ఐదు వన్డేల కోసం భారతదేశం జింబాబ్వేలో పర్యటించింది . ధావన్ నాలుగు మ్యాచ్ల్లో 52.25 సగటుతో మొత్తం 209 పరుగులు చేసి, సిరీస్లో అగ్రగామిగా నిలిచాడు. భారత్ 5-0తో సిరీస్ను గెలుచుకుంది.[54] హరారేలో జరిగిన రెండో మ్యాచ్లో, అతను తన మూడో వన్డే సెంచరీని సాధించాడు. 17వ ఓవర్లో 65/4 తర్వాత భారత్ 294/8 చేరేందుకు సహాయపడిన 116 పరుగుల ఇన్నింగ్స్కు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[55]
2013లో అతని ప్రదర్శనకు, ICC చే వరల్డ్ వన్డే XIలో పేరు పొందాడు.[56] 2013లో అతని ప్రదర్శనలకు క్రిక్ఇన్ఫో వన్డే XIలో కూడా ఎంపికయ్యాడు [57]
2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ధావన్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు.[58] 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతని స్థానంలో డారెన్ సామీ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా నియమించబడ్డాడు.[59]
2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ధావన్ను నిలుపుకుంది. టోర్నీలో 14 మ్యాచ్ల్లో 36.84 సగటుతో 479 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్లో అతని జట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది.[60]
2018 IPL వేలంలో ధావన్ను సన్రైజర్స్ హైదరాబాద్ వారి RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్ ఉపయోగించి ₹ 5.2 కోట్లకు కొనుగోలు చేసింది.[61]2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో, అతను 497 పరుగులు చేశాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి అతని జట్టు రన్నరప్గా నిలిచింది. అతన్ని 2019 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది.[62] 2019 IPL సీజన్లో ధావన్ ప్రదర్శనలకు, అతను Cricinfo IPL XIలో పేరు పొందాడు.[63] 2020 అక్టోబరు 20న, ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్మెన్ అయ్యాడు. అదే రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 5000 పరుగుల మార్క్ను దాటిన ఐదవ బ్యాట్స్మన్ అయ్యాడు.[64][65] 34 ఏళ్ల ధావన్ IPL 2020లో టాప్ స్కోరర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు [66] 2020 ఐపీఎల్లో శిఖర్ ధావన్ 600 పరుగులు పూర్తి చేశాడు.
ధావన్, ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాటరు.[67] 2020 జనవరి నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్లో 24 సెంచరీలు చేసాడు – టెస్టు క్రికెట్లో 7, వన్డే ఇంటర్నేషనల్స్ లో 17. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ మేకర్ల జాబితాలో యాభై ఆరవ స్థానంలో ఉన్నాడు.[68]
2009లో, ధావన్ మెల్బోర్న్కు చెందిన ఏషా ముఖర్జీ అనే ఔత్సాహిక కిక్బాక్సర్తో నిశ్చితార్థం చేసుకుని,[110] 2012లో పెళ్ళి చేసుకున్నాడు.[111][112] హర్భజన్ సింగ్ ద్వారా ధావన్ ముఖర్జీలకు పరిచయమైంది.[113][114] ఆమె ధావన్ కంటే 12 సంవత్సరాలు పెద్దది,[111] ఆమెకు మునుపటి సంబంధంతో ఇద్దరు కుమార్తెలున్నారు.[114] 2014 డిసెంబరులో ఆమె జోరావర్ అనే కొడుకుకు జన్మనిచ్చింది.[115] ధావన్, ఈషా కుమార్తెలు అలియా, రియాలను దత్తత తీసుకున్నాడు.[116] 2019 జూలైలో, ధావన్ తన ఆగ్నేయ మెల్బోర్న్లో ఇల్లు కొన్నాడు. శిఖర్ ధావన్ తన కుటుంబంతో 2015 నుండి క్లైడ్ నార్త్ హోమ్లో నివసిస్తున్నాడు.[117] ధావన్, ముఖర్జీలు 2021 సెప్టెంబరులో తమ కాపురానికి ముగింపు పలికారు [118] కోర్టులో విచారణ అనంతరం 2023 అక్టోబరు 05న ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అతడి కుమారుడు జొరావర్ ను భారత్ లేదా ఆస్ట్రేలియాలో కలిసేందుకు, తన కొడుకుతో వీడియో కాల్స్ కూడా మాట్లాడొచ్చని అనుమతి ఇచ్చింది.[119][120]